ఆత్మీయ సందేశములు

ఆత్మీయ సందేశములు

09-04-2023 – పునరుత్థానం వలన కలిగిన ఆశీర్వాదం

“క్రీస్తుతోకూడ చనిపోయినయెడల” అంటే క్రీస్తు పాపముల విషయములో చనిపోయినట్టే మనము కూడా పాపము విషయములో చనిపోతే, ఎలా అయితే యేసు క్రీస్తు మరలా చనిపోడో, మనము మరలా పాపములోనికి వెళ్ళకూడదు. మరణమునకు యేసయ్య మీద అధికారము లేదు. అలాగే ఆయనయందు విశ్వాసముంచిన మన మీద కూడా మరణమునకు అధికారము లేదు.

09-04-2023 – ఆయన లేచి ఉన్నాడు

1. మొదటి దినము: సిలువలో వెల మన పాపములకు చెల్లించబడింది.
2. రెండవ దినము: సమాధి చేయబడ్డాడు ఆయనతో పాటు మన పాపములను సమాధిచేసాడు. చెరను విడుదలచేసాడు.
3. మూడవ దినము: పాప పరిహారము ముగించిన యేసయ్యకు తండ్రి ఆత్మ ద్వార పునరుత్థాన శక్తి అనుగ్రహించి మృతులలో నుండి లేపినాడు.

07-04-2023 – నీ కొరకు వెల చెల్లించబడింది

నాల్గవ మాట పలకక మునుపు, మనము చీకటిలో ఉన్నవారము. ఎప్పుడైతే ఆయన ఆ నాల్గవమాట పలికారో, అప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాము. ఇకనుండి మనకు ఇవ్వబడిన బాధ్యత అంతా దేవుని గుణాతిశయములను ప్రచురించుటకే! ఇప్పుడు మనము ఏమై ఉన్నామో అని గమనిస్తే, “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలు”. నిత్యము చిగురించే వంశములోనికి మనము పిలువబడ్డాము.

02-04-2023 ఆదివారం రెండవ ఆరాధన – నీవు విలువైనవాడవు

మనము బండ అయిన క్రీస్తులో నిలబడి ఉన్నప్పుడు, ఆయన ద్వారా నీ జీవితము అనుగ్రహించబడినది అని నమ్మి నిలబడినప్పుడు, దేవుడు నీ పక్షమున నిలబడతాడు. దేవుడే నీ పక్షమున ఉంటే, సర్వమూ నీ పక్షమున ఉన్నట్టే.

సమస్తము యేసయ్య పాదముల క్రింద ఉన్నవి. మనము ఆ క్రీస్తును ఆధారముగా చేసుకొని నిలబడినవారము గనుక ఆ సమస్తమూ మన యెదుట ఉన్నట్టే. అందుకే మన జీవితము ఎంతో విలువైనది.

02-04-2023 ఆదివారం మొదటి ఆరాధన – మట్టల ఆదివారము

ఎందుకు యేసుప్రభువు యెరుషలేములోనికి అడుగు పెట్టాడు? అనే సంగతి వారికి తెలియట్లేదు. ఆ సమయములో కొంతమంది ప్రభువు చేసిన అద్భుతముల గురించి దేవునిని మహిమ పరచారు. మరికొంతమంది శిష్యులను గద్దించమని యేసుకు చెప్తున్నారు. అయితే మట్టల ఆదివారము యొక్క ఉద్దేశ్యము పాపము నుండి విడుదల కొరకైన సిద్ధపాటు. నీ మీద ఉన్న పాపపు పత్రపు వెల చెల్లించుటకొరకైన సిద్ధపాటు. నీ విడుదల కొరకైన సిద్ధపాటు.

26-03-2023 ఆదివారం మొదటి ఆరాధన – ప్రార్ధన యొక్క శక్తి

దమస్కులో అననీయ చేసిన ప్రార్థన జరగబోయే మరణమునుండి అక్కడి విశ్వాసులందరినీ రక్షించింది. సంఘము ఆసక్తిగా చేసిన ప్రార్థన పేతురును చెరసాలనుండి విడిపించింది. అలాగే నీవు ఆసక్తి కలిగి చేసే ప్రార్థన పరలోకమును కదిలిస్తుంది. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు.

గుర్తొచ్చినప్పుడు చేసేది ప్రార్థన కాదు కానీ ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో చేసేదే నిజమైన ప్రార్థన.

19-03-2023 ఆదివారం మొదటి ఆరాధన – ఆయన దీవించు వాడు

మన దేవుడు దీవించువాడై ఉన్నాడు. దీవెన అనే మాట వినగానే మనకు ఎంతో సంతోషముగా ఉంటుంది. అయితే వాక్యము ఏమి చెప్పుచున్నదో ఆ ప్రకారము మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. “వాక్యము నా పాదములకు దీపము అయి ఉన్నది” అని వ్రాయబడి ఉన్నది. చీకటిలో మన దగ్గర ఒక దీపము వున్నప్పుడు మనము వెళ్ళే త్రోవ స్పష్టముగా కనబడుతుంది. కాబట్టి అవరోధాలు తప్పించుకుని వెళ్ళగలుగుతాము. అయితే మరి వాక్యము ఎక్కడ వెలుగై ఉన్నది? మన జీవిత ప్రయాణములో వెలుగై ఉన్నది. ప్రయాణాలలో ఎత్తుపల్లాలు ఎలా అయితే రాక మానవో, జీవిత ప్రయాణములో కూడా ఎత్తుపల్లాలు తప్పవు. కానీ, ఎవరైతే వాక్యమును ఎరిగిఉంటారో, వారు ఆ అవరోధాలు తప్పించుకోగలుగుతారు.

12-03-2023 ఆదివారం రెండవ ఆరాధన – దేవుడు మనకు తోడై ఉన్నాడు

మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడూ అని చూస్తే, ఇశ్రాయేలీయులను కానానుకు తీసుకువెళ్ళాలి. అది దేవుని చిత్తము అందుకే తోడై ఉన్నాడు. అలాగే మిగల్చబడిన వాగ్దానపు నెరవేర్పు కొరకు యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే యేసు క్రీస్తును చూస్తే, “తన ప్రజలను తానే రక్షించునట్లు” దేవుని చిత్తము నెరవేర్చడానికి తోడై ఉన్నాడు. దేవుని చిత్తము నీపై ఉంటే, నీకు వ్యతిరేకముగా కలిగే దురాలోచన నిలువదు. అపాయము ఉన్ననూ ఉపాయము లేని వారము కాదు అని పౌలు ఎందుకు చెప్పగలుగుతున్నాడు? దేవుని చిత్తము ప్రకారము పిలువబడ్డాడు. దేవుని చిత్తములో ఉన్న నీవు అసాధారణమైనవాడవు, అసాధారణమైన దానివి. అందుకే నీ ఎదుటకు మరణము వచ్చినా సరే వెనుకకు వెళ్ళవలసినదే.

12-03-2023 ఆదివారం మొదటి ఆరాధన

“నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు” అనగా ఏమిటి? కేవలము పొందుకోవడము మాత్రమే కాదు కానీ, దినదినమూ ఆ జీవములో నిలిచి కొనసాగునట్లు అని అర్థము. పాపము అనుమతిస్తే, జీవము పోగొట్టుకుంటాము. అయితే ఆ జీవములో నిలిచి ఉన్నప్పుడు ఆ జీవములోనూ వృద్ధి కలుగుతుంది. ఉదాహరణకు చిన్నపిల్లవాడిని చూస్తే, మొదట వాడు బలహీనముగా ఉంటాడు, ఆధారపడి ఉంటాడు అయితే ఎదిగే కొద్దీ, వాడిలో మార్పు వస్తుంది. అలాగే మనము కూడా, ఆ జీవములో నిలిచి ఉంటే, మన క్రియలలో మార్పు కనబడుతుంది.

05-03-2023 ఆదివారం రెండవ ఆరాధన – కృప విస్తరించును 

ఈ లోకములో అనేకమైన మర్యాదలు, వ్యవహారములు ఉన్నాయి. అయితే వాటి ప్రకారము కాకుండా, దేవుని చిత్తప్రకారము ఏది మచిది? ఏది ఉత్తమమైనది అని తెలుసుకుని ఆ ప్రకారము చెయ్యాలి! మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. బలిగా అర్పించుట అనేదానిని గమనించినపుడు, ఒకసారి అర్పించినతరువాత దానిలో ఇక ఏ మాత్రము జీవము ఉండదు. అలాగే మనము సజీవ యాగముగా మనము అర్పించినప్పుడు, మన జీవితములో ఇంతకు ముందు ఉన్న లోకానుసారమైన సంగతులు ఇక జీవించకూడదు.