నీవు ఏ యేసును వెతుకుతున్నావు?

మన అందరికీ మహిమా జీవితము అనుగ్రహించబడింది అని లేఖనములు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మహిమాజీవితం మనము అనుభవించకుండా ఏమి అడ్డువస్తుంది?


దూత ఆ స్ర్తిలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి -మత్తయి 28:5-6.

అనేకులు పునరుత్థానుడైన యేసును గుర్తించలేకపోతున్నారు. సిలువవేయబడీన యేసును గూర్చి వెతుకుతున్నారు. యేసు తాను చెప్పినట్టే తిరిగిలేచాడు. అయితే ఆ విషయమును గుర్తించలేకపోతున్నాము. అనేకుల ప్రార్ధన గమనించినట్టయితే, నేను పాపిని, నేను కుక్కను పెంటకుప్పవంటి జీవితం అని ప్రార్ధిస్తారు. దానిని తగ్గింపుగా భావిస్తారు అయితే మృత్యుంజయుడైన యేసును గుర్తించలేక దేవుడు దయచేసిన మహిమను గుర్తించలేకపోతున్నారు. మనము ప్రభువును వెతకవలసిన చోటు వేరు.

వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు–సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు –మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. -లూకా 24:5-7.

అందు కతడు కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని, ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. -మార్కు 16:6-10.

వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి. -మార్కు 16:13.


మన పాపములకొరకు సిలువలో ప్రాయశ్చిత్తము చేసిన యేసును మనము ప్రతిదినము జ్ఞాపకము చేసుకుంటున్నాము. అయితే అదే యేసు మృత్యుంజయుడై తిరిగిలేచాడు. ఆ తిరిగి లేచిన యేసును గనుక మనము గుర్తించినట్టయితే దేవుని మహిమ మన జీవితంలో కుమ్మరించబడుతుంది. ఈ మహిమను గమనించినట్టయితే, ఆదాముజీవితములో ఆరంభించబడింది. అయితే ఆదాముయొక్క పాపమును బట్టి ఆ మహిమను కోల్పోయాడు. అయితే ప్రభుయేసు పునరుత్థానుడైనతరువాత ఆ మహిమ తిరిగి పొందగలుగుతున్నాము. ఆదాము, పాపము చేయక మునుపు, తన స్థితి ఎరుగనీయకుండా దేవుని మహిమచేత కప్పబడినాడు. అలాగే మనము కూడా యేసు పునరుత్థానమును గ్రహించగలిగితే మహిమా వస్త్రముచేత కప్పబడినవారుగా మనము చెయ్యబడతాము.


పాపమును బట్టి మహిమ పోయిందియేసు పునరుత్థానమును బట్టి పోయిన మహిమ తిరిగి దయచేయబడింది.


ఇప్పుడు ఈ మహిమా జీవితంలో మనము కొనసాగించబడలేకుండా ఉండటానికి కారణం ఏమిటి? మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. -రోమా 8:11. కలువరి సిలువలో మన పాపములకు వెల చెల్లించబడింది. పునరుత్థానమునుబట్టి జయజీవితము మనకు అనుగ్రహించబడింది.

ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.౹ -యోహాను 20:9.

ఈ పేతురు మరియు యోహాను ఇద్దరూ యేసును వెంబడించారు. మగ్దలేనే మరియకంటే ఎక్కువగా ప్రభువును వెంబడించారు. అయితే మరియ వచ్చి వారితో ప్రభువు సమాధిలో లేని విషయాన్ని చెప్పినప్పుడు, ఆమెతో ప్రభువు చెప్పినమాటలు చెప్పలేదు, పైగా కంగారుపడి పరుగెత్తి వెళ్ళిచూచినా సరే ప్రభువు మాటలు జ్ఞాపకము చేసుకోలేక, ఆ మహిమను పొందలేకపోయారు అనగా పునరుత్థానుడైన యేసును గ్రహించలేకపోయారు. మనజీవితంలో వచ్చే పరిస్థితిలో, ఇతరులు (అన్యులు లేదా విశ్వాసము తక్కువకలిగినవారు) వచ్చి ఏమి చెప్పినా, దేవుని లేఖన సత్యములు ఎరిగినవారుగా వారిని వెంబడించక, ఆ పరిస్థితిలో ఎక్కడ వెతకాలో, ఎవరిని వెతకాలో అక్కడ ఆయనను వెతికేవారిగా ఉంటాము. అప్పుడు ఆయన అనుగ్రహించిన మహిమను పొందగలుతాము.

యేసు–అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని–అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.౹ -యోహాను 20:15.

యేసుప్రభువు ప్రత్యక్షమైతే ఆయన తోటమాలి అనుకుని మరియ మాట్లాడుతుంది. మరియ “నా ప్రభువు” అని అంటుంది. కాని ఎవరో ఎత్తుకుపోయారు అని అంటుంది. అయితే ఆమె వెనుక ఉన్న యేసును చూచికూడా యేసును గుర్తించలేకపోయింది. మహిమాజీవితంలో “అనుకోవడం” అనే పరిస్థితే ఉండదు. “మార్త ఆయనతో–అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.౹ -యోహాను 11:24”, మార్తకూడా తనకు తెలిసినదానిని బట్టి అప్పటికి తన తమ్ముడు మృతులలోనుండి లేచును అని నమ్మలేదు. అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;౹ -యోహాను 11:40. అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;౹ -యోహాను 11:25.
యేసును గుర్తించలేకపోతే మన జీవితములు మహిమను చూడలేకపోతాము. మన కళ్ళముందు కనబడేదానికంటే, ప్రభువుమాటలుగనుక నమ్మేవారిగా ఉంటే, ఆయన మహిమను చూసేవారిగా ఉంటాము అనగా చనిపోయినను బ్రతుకును, బ్రతుకువాడు ఎన్నటికిని చనిపోము. అనగా ఇంతకుముందు పోగొట్టుకున్నది తిరిగిపొందుకోగలము, అలాగే ఇకమరెన్నడు పోగొట్టుకోము. దేవుడు నిర్ణయించినది మనము పోగొట్టుకున్నాము
కాని అనేకసార్లు, ఆయన వాక్యమును నమ్మక, ఆయన ఏమై ఉన్నాడో ఎరుగక ఆయన మహిమను అనుభవించలేకపోతున్నాము.
దేవుడు మన జీవితములో నిర్ణయించినది మనము పోగొట్టుకున్నాము. అయితే ప్రభువుయొక్క పునరుత్థానమును గ్రహించినవారిగా మనము ఉన్నప్పుడు, దేవుడు నిర్ణయించినది మరలా పొందుకుంటాము. అలాగే దేవుని చేత మనజీవితంలో నిర్ణయించబడింది ఏదీ పోగొట్టుకొనము.

1. సజీవుడైన యేసును వెతకాలి

2. లేఖనములు గ్రహించినప్పుడు సజీవుడైన యేసును వెతకగలుగుతావు

3. ఆ లేఖనములను నమ్మినప్పుడు, దేవుని మహిమను చూడగలుతావు.

యూట్యూబ్లో ఈ మెసేజ్ ను చూడండి.